సన్న వరి రైతులకు అలర్ట్.. రూ. 500 బోనస్ పొందడానికి సెప్టెంబర్ 10 చివరి గడువు!
తెలంగాణలో వానాకాలం సీజన్లో సన్న రకం వరి సాగు చేస్తున్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్ ఫలాలు పొందాలంటే రైతులు తమ పంట సాగు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు సంబంధించి సెప్టెంబర్ 10వ తేదీని తుది గడువుగా ఖరారు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. గడువు ముగిసేలోగా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దళారుల ప్రమేయం లేకుండా అర్హులైన రైతులకే నేరుగా బోనస్ అందేలా ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టారు. రైతులు తాము కొనుగోలు చేసిన సన్న విత్తనాల వివరాలను డీలర్ల ద్వారా లేదా నేరుగా టీ-ఆగ్రిసీడ్స్ (T-Agri Seeds) పోర్టల్లో ఆన్లైన్ చేయించుకోవాలి. లైసెన్ే్సడ్ డీలర్ల వద్ద విత్తనాలు కొన్నవారు ఆ రసీదులను భద్రపరచుకోవాల్సి ఉండగా, తమ సొంత విత్తనాలను ఉపయోగించి సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు (AEO) సెల్ఫ్ డిక్లరేషన్ (స్వయం ప్రకటన) పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేక సన్న రకాల సాగుకు మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుందని, గడువులోపు వివరాలు నమోదు చేయనియెడల బోనస్ కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.