డ్రోన్, కౌంటర్-డ్రోన్ టెక్నాలజీలను ప్రదర్శించనున్న ఐఏఎఫ్
జైసల్మేర్: భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో రాజస్థాన్లోని పోఖ్రాన్ రేంజ్లో సెప్టెంబర్ 14 నుండి 16 వరకు ‘డ్రోనథాన్-2026’ నిర్వహించనున్నారు. మానవరహిత వైమానిక వ్యవస్థలు (యూఏఎస్), కౌంటర్-మానవరహిత వైమానిక వ్యవస్థలు (సీయూఏఎస్) రంగాలలో స్వదేశీ తయారీదారులు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు తమ సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శించేందుకు ఈ మూడు రోజుల కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది. ఇందులో భాగంగా ఆధునిక డ్రోన్ మరియు కౌంటర్-డ్రోన్ సాంకేతికతల స్టాటిక్ డిస్ప్లేలతో పాటు ప్రత్యక్ష ప్రదర్శనలు (లైవ్ డెమోలు) ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రదర్శనలో నిఘా, గూఢచార సేకరణ, స్వయంప్రతిపత్తి కలిగిన కార్యకలాపాలు, స్వార్మ్ టెక్నాలజీలు మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వంటి రక్షణ రంగానికి చెందిన కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. కేంద్ర ప్రభుత్వ 'ఆత్మనిర్భర్ భారత్' దార్శనికతకు అనుగుణంగా, భవిష్యత్ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా స్వదేశీ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.