కోచింగ్ సెంటర్ల ముసాయిదా చట్టంపై సూచనల గడువు పొడిగింపు
ముంబై: ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నియంత్రణ ముసాయిదా చట్టం-2026పై ప్రజలు, భాగస్వాముల నుండి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించే గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ ముసాయిదాపై సెప్టెంబర్ 7 నాటికి 11,410 ప్రతిస్పందనలు వచ్చినట్లు సెకండరీ విద్యాశాఖ డైరెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను సమర్పించడానికి మరికొంత సమయం ఇచ్చేందుకు, వారందించిన సూచనలను సమగ్రంగా పరిశీలించేందుకే ఈ గడువును పొడిగించినట్లు ఆయన వివరించారు.
రాష్ట్రంలోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నమోదు, నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదిత చట్టాన్ని రూపకల్పన చేశారు. పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్సైట్లో మరాఠీ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉన్న ఈ ముసాయిదాపై తమ స్పందనలను పూణేలోని విద్యా కమిషనర్ లేదా సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ డైరెక్టర్కు రాతపూర్వకంగా కానీ, ఇమెయిల్ ద్వారా కానీ పంపవచ్చని అధికారులు తెలిపారు. ప్రజల నుండి వచ్చే సూచనలను పరిశీలించిన అనంతరమే తుది చట్టానికి పూర్తి రూపునిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.