ఎఫ్టీ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ర్యాంకింగ్స్
ప్రపంచ టాప్ 100లో 14 భారతీయ బి-స్కూళ్లు
న్యూఢిల్లీ: గ్లోబల్ మేనేజ్మెంట్ విద్యారంగంలో భారతీయ విద్యాసంస్థలు తమ ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. తాజాగా విడుదలైన 'ఫైనాన్షియల్ టైమ్స్ (FT) మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ (MiM) 2026' ర్యాంకింగ్స్లో ఏడు ఐఐఎంలతో సహా దేశానికి చెందిన 14 బి-స్కూళ్లు ప్రపంచంలోనే టాప్ 100 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. భారతీయ విద్యాసంస్థల్లో ఐఐఎం బెంగళూరు 21వ ర్యాంకుతో అగ్రస్థానంలో నిలవగా, ముంబైకి చెందిన ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (SPJIMR) 26వ ర్యాంకుతో రెండవ స్థానంలో నిలిచింది. ఐఐఎం అహ్మదాబాద్ 27, ఎక్స్ఎల్ఆర్ఐ 33, ఐఐఎం కలకత్తా 39వ స్థానాలను కైవసం చేసుకున్నాయి.
గ్లోబల్ స్థాయిలో స్విట్జర్లాండ్లోని సెయింట్ గాలెన్ విశ్వవిద్యాలయం ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకోగా, పోర్చుగల్కు చెందిన నోవా స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్ రెండవ ర్యాంకును, చైనాలోని షాంఘై జియావో టాంగ్ విశ్వవిద్యాలయం మూడవ స్థానాన్ని సాధించాయి. పూర్వ విద్యార్థుల అభిప్రాయాలు, ఉద్యోగావకాశాలు, వేతనాలు, విద్యార్థుల వైవిధ్యం మరియు అంతర్జాతీయీకరణ వంటి 19 విభిన్న ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ను విడుదల చేసినట్లు ప్రతినిధులు వెల్లడించారు.