వచ్చే ఏడాది మే-జూన్ నాటికి భారత బుల్లెట్ రైలు పరీక్షలు
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
వడోదర: భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన మొట్టమొదటి బుల్లెట్ రైలు పరీక్షలు వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పరీక్షలు పూర్తయిన రెండు నుంచి నాలుగు నెలల వ్యవధిలోనే ఈ రైలును అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. వడోదరలో నిర్వహించిన ‘నమో ఫర్ విక్సిత్ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, బుల్లెట్ రైలుకు సంబంధించిన మొదటి బాడీ ఫ్రేమ్ నిర్మాణం పూర్తయిందని, ప్రస్తుతం దానిని స్క్వీజ్ టెస్ట్ కోసం పంపినట్లు పేర్కొన్నారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంలో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఈ రైలు అందుబాటులోకి వస్తే వడోదర - ముంబై మధ్య ప్రయాణ సమయం కేవలం 90 నిమిషాలకు తగ్గుతుందని ఆయన చెప్పారు. అలాగే ఈ ప్రాజెక్టులో కీలకమైన సూరత్ - వాపి సెక్షన్ నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తవుతుందని స్పష్టం చేశారు.
కేవలం బుల్లెట్ రైలే కాకుండా భారతీయ రైల్వేను సమగ్రంగా ఆధునీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఆపరేటింగ్, రిజర్వేషన్ వ్యవస్థల ఆధునీకరణతో పాటు సరుకు రవాణా కోసం కొత్త డిజైన్ వ్యాగన్లను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 280 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, 36,000 కిలోమీటర్ల కొత్త ట్రాక్ల నిర్మాణం పూర్తయ్యాయని, చెనాబ్ వంతెన, మిజోరాం రైల్వే కనెక్టివిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు.