భారతదేశ భవిష్యత్తు నిర్మాణంలో గిరిజన సమాజాలు భాగస్వాములు
ఇటానగర్లోని న్యేదర్ నమ్లోలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
ఇటానగర్: ‘వికాస్ భీ, విరాసత్ భీ’ (అభివృద్ధి, వారసత్వం రెండూ) అనే దార్శనికతతో గిరిజన సమాజాలు భారతదేశ గతాన్ని కాపాడే సంరక్షకులుగానే కాకుండా, దేశ భవిష్యత్తును నిర్మించడంలో అత్యంత కీలక భాగస్వాములుగా నిలుస్తున్నారని ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ కొనియాడారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్లో ఉన్న న్యేదర్ నమ్లోను సందర్శించిన ఆయన, అక్కడి పవిత్ర ప్రార్థనా స్థలంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం జరిగిన సామాజిక సభలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ... న్యేదర్ నమ్లో "సంప్రదాయాలు ఆధునిక ఆలోచనలుగా మారే చోటు, మరియు ఆధునిక ఆలోచనలు సంప్రదాయాలను నాశనం చేయని చోటు" అని అభివర్ణించారు. ప్రాచీన సంప్రదాయాలు, ఆధునిక ఆకాంక్షలు కలిసి మెలిసి జీవించే భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వానికి అరుణాచల్ ప్రదేశ్ ఒక గొప్ప ప్రతీక అని అన్నారు.
దేశీయ సాంస్కృతిక వారసత్వాన్ని, ఆచార చట్టాలను పరిరక్షించడంలో న్యీషి సమాజం మరియు ‘యెర్కో’ గురుకుల వ్యవస్థ చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. మాతృభాష, సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే యువత ఆధునిక విజ్ఞానం, సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. స్వదేశీ సంస్కృతిని కాపాడుకోవడం అంటే మార్పును అడ్డుకోవడం కాదని, మన గుర్తింపును కోల్పోకుండా అభివృద్ధి పథంలో పయనించడమేనని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్, పార్లమెంట్ సభ్యుడు తాయ్ టాగక్, హోం మరియు స్వదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మామా నటుంగ్ తదితరులు పాల్గొన్నారు.