హరిత హైడ్రోజన్ ఉత్పత్తికి కొత్త దారి
లోహరహిత సేంద్రీయ అణువులతో బెంగళూరు శాస్త్రవేత్తల పరిశోధన
బెంగళూరు:సౌరశక్తి ఆధారంగా హరిత హైడ్రోజన్ (Green Hydrogen) ఉత్పత్తిని మరింత చౌకగా, సులభంగా చేపట్టి, పర్యావరణ అనుకూల విధానంలో మెరుగుపరిచేందుకు బెంగళూరులోని సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ (CeNS) శాస్త్రవేత్తలు సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. సహజంగా లభించే అమైనో ఆమ్లాన్ని ఉపయోగించుకుని, ఎటువంటి ఖరీదైన లోహాలు లేని ఒక సేంద్రీయ ఫోటోక్యాటలిస్ట్ (Photo-catalyst) పదార్థాన్ని అభివృద్ధి చేశారు.
కేంద్ర విజ్ఞాన, సాంకేతిక శాఖ (DST) పరిధిలోని CeNS సంస్థకు చెందిన డాక్టర్ గౌతమ్ ఘోష్, డాక్టర్ అశుతోష్ కె. సింగ్ నేతృత్వంలోని బృందం ఆస్పార్టిక్ ఆమ్లం (అమైనో ఆమ్లం) మరియు పెరిలీన్ డైమైడ్ (PDI) అనే కాంతిని శోషించే సేంద్రీయ అణువులను ఏకీకృతం చేసింది. నీటిలో ఈ అణువులు వాటంతట అవే (Self-assembly) ద్విమితీయ (2D) నానోషీట్లుగా ఏర్పడటం ద్వారా సూర్యకాంతిని రసాయన శక్తిగా మార్చే సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ప్రస్తుతం ఉపయోగించే ఫోటోక్యాటలిస్ట్లు ఖరీదైన లోహాలపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే, ఈ కొత్త స్వీయ-సమాహార సేంద్రీయ పదార్థం సూర్యకాంతి ఆధారిత నీటి విభజనలో సాధారణ పదార్థాల కంటే 18 శాతం ఎక్కువ ఫోటోకరెంట్ను ఉత్పత్తి చేసి హైడ్రోజన్ ఉత్పత్తిని వేగవంతం చేసింది. రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీకి చెందిన 'జర్నల్ ఆఫ్ మెటీరియల్స్ కెమిస్ట్రీ ఎ'లో ప్రచురితమైన ఈ పరిశోధన, భవిష్యత్తులో ఖరీదైన లోహాలపై ఆధారపడటాన్ని తగ్గించి, హరిత హైడ్రోజన్, కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ మరియు పునరుత్పాదక ఇంధన రంగాల్లో కీలక మార్పులు తీసుకురానుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.