రూ. 10,783 కోట్లతో మరో 3 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ విస్తరణ, లాజిస్టిక్స్ సామర్థ్యం పెంపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) రూ. 10,783 కోట్ల అంచనా వ్యయంతో కూడిన మూడు ప్రధాన రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్లోని 14 జిల్లాల పరిధిలో దాదాపు 656 కిలోమీటర్ల మేర అదనపు రైలు మార్గాలు అందుబాటులోకి రానున్నాయి.
ఆమోదం పొందిన రైల్వే మార్గాలు
ఖరగ్పూర్ - ఝార్సుగూడ (బాగ్దేహి) 4వ లైన్ నిర్మాణం.
కట్నీ - పెండ్రా రోడ్ 4వ లైన్ నిర్మాణం.
బిలాస్పూర్ (ఉస్లాపూర్) - పెండ్రా రోడ్ 3వ లైన్ నిర్మాణం.
‘పీఎం గతి శక్తి’ జాతీయ మాస్టర్ ప్లాన్ కింద రూపొందించిన ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే కీలక మార్గాల్లో సరుకు రవాణా వేగవంతమై రైళ్ల రద్దీ తగ్గుతుంది. దాదాపు 56 లక్షల జనాభా కలిగిన 4,790 గ్రామాలకు అనుసంధానం మెరుగుపడటంతో పాటు తారాతారిణి ఆలయం, జగన్నాథ ఆలయం, అమరకంటక్, బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ వంటి ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. బొగ్గు, సిమెంట్, ఇనుము, ఉక్కు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాల ద్వారా ఏటా 27 మిలియన్ టన్నుల (MTPA) అదనపు సరుకు రవాణా సాధ్యమవుతుంది. అంతేకాకుండా, 12 కోట్ల లీటర్ల ఇంధన దిగుమతి తగ్గి, 62 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు నియంత్రణలోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.