దేశీ గోవుల పరిరక్షణే లక్ష్యం 100 దేశీ ఆవుల సంరక్షణకు డాక్టర్ ఆర్ఎస్ఎస్ దేశీ గోశాల కార్యాచరణ
దేశీ గోవుల పరిరక్షణే లక్ష్యం
100 దేశీ ఆవుల పరిరక్షణకు డాక్టర్ ఆర్ఎస్ఎస్ దేశీ గోశాల కార్యచరణ
- గరకు స్తంభాల ప్రతిష్ట
పామూరు, మేజర్ న్యూస్ :
దేశీ గోవుల పరిరక్షణ, సంరక్షణకు వేదికగా నిలుస్తున్న డాక్టర్ ఆర్ఎస్ఎస్ దేశీ గోశాలలో గరకు స్తంభాల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గోశాలకు అవసరమైన గరకు స్తంభాలను పులివెందులకు చెందిన గాలి చిన్న వెంకటేష్, ఆయన సతీమణి అంజనా దేవి, కుమారుడు వెంకట సాయి, కుమార్తె తేజశ్రీతో పాటు వారి బంధుమిత్రులు కలిసి దానం చేశారు.ఈ సందర్భంగా దేశీ గోశాల నిర్వాహకులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ఎస్ఎస్ మాట్లాడుతూ భవిష్యత్తులో 100 దేశీ ఆవులను పరిరక్షించడమే గోశాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఒంగోలు, పుంగనూరు, గిరి, హల్లికర్, తార్పర్కర్, స్వర్ణ కపిల, మల్నాడు గిట్ట తదితర దేశీ ఆవుల జాతులను సంరక్షించే దిశగా గోశాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం దేశీ గోశాలలో గోవుల పరిరక్షణకు అవసరమైన రెండు కుటుంబాలు, విశాలమైన సాగుభూమి, నీటి వనరులు, పచ్చటి మహావృక్షాలు, పచ్చిగడ్డి, ఎండుగడ్డి వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ ఆర్ఎస్ఎస్ వివరించారు. ప్రకృతి ఒడిలో పక్షిజాతులు, వివిధ రకాల కోళ్లు, బాతులు తదితర జీవులతో గోశాల ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగుతోందన్నారు.
దేశీ గోవుల పరిరక్షణతో పాటు ప్రకృతి, జీవవైవిధ్యాన్ని కాపాడేలా దేశీ గోశాలను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు డాక్టర్ ఆర్ఎస్ఎస్ తెలిపారు.