ఒడిశా అడవుల్లో అరుదైన ఒరంగుటాన్ల కలకలం.. భయపెడుతున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ కోణాలు!
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా భోగ్రాయ్ అటవీ ప్రాంతంలో అత్యంత అరుదైన పరిణామం చోటుచేసుకుంది. సాధారణంగా మలేషియా, ఇండోనేషియా వంటి అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఐదు ఒరంగుటాన్ (Orangutan) పిల్లలను స్థానిక అటవీ అధికారులు భోగ్రాయ్ మండలం బిచిత్రాపూర్ అటవీ ప్రాంతంలో గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఆ ఐదు అరుదైన వానరాలను సురక్షితంగా రక్షించారు. భారతదేశపు వాతావరణంలో సహజంగా జీవించని ఈ ఒరంగుటాన్లు ఒడిశా అడవుల్లోకి ఎలా వచ్చాయనేది ప్రస్తుతం అంతుచిక్కని రహస్యంగా మారింది. ఇవి వేల కిలోమీటర్ల దూరంలో ఉండే ఆగ్నేయాసియా అడవులకు చెందినవి కావడంతో, సహజంగా వలస వచ్చే అవకాశం లేదని, దీని వెనుక అంతర్జాతీయ వన్యప్రాణి అక్రమ రవాణా (Wildlife Trafficking) ముఠా హస్తం ఉండొచ్చని అధికారులు గట్టిగా అనుమానిస్తున్నారు. స్మగ్లర్లు పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడానికి వీటిని ఇక్కడ వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. రక్షించిన జంతువులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, మెరుగైన సంరక్షణ కోసం భువనేశ్వర్లోని ప్రసిద్ధ నందన్కానన్ జూపార్క్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై వైల్డ్లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (WCCB) సహకారంతో సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.