గుంతలో చిక్కిన చిరుతను హతమార్చిన ముఠా
చిరుత చర్మం, 17 గోర్లు విక్రయానికి యత్నం...
- నలుగురు నిందితుల అరెస్టు
- విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కొత్తగూడెం క్రైమ్, సూర్య మేజర్ న్యూస్
గుంతలో పడి విలవిల్లాడుతున్న ఓ చిరుతపులిని కర్కశంగా చంపి, దాని చర్మం, గోర్లను అమ్ముకునేందుకు యత్నించిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. సోమవారం స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బూర్గంపహాడ్ మండలం తాళ్లగొమ్మూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే... గత ఏడాది వేసవిలో చింతూరు మండలం గమ్మలకోట గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఓ చిరుతపులి గుంతలో పడిపోయింది. బయటకు రాలేని స్థితిలో చిక్కుకున్న దాన్ని నిందితులు రాళ్లు, కర్రలతో కొట్టి, బాణాలు సంధించి పొట్టనబెట్టుకున్నారు. అనంతరం చర్మం వలిచి ఎండబెట్టి, గోర్లను దాచిపెట్టారని తెలిపారు.
*బేరసారాలు.. బట్టబయలు:*
చిరుత చర్మం, గోర్లు అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించిన సారపాకకు చెందిన చల్లా అనిల్కుమార్, భూమి కౌలు వ్యవహారంలో పరిచయమైన గమ్మలకోటకు చెందిన కుంజ భద్రయ్యను సంప్రదించాడు. కొనుగోలుదారులను చూపిస్తానని అనిల్ చెప్పడంతో భద్రయ్య, కుంజా గంగరాజు, మడవి కన్నయ్యలు చర్మం, గోర్లను బ్యాగ్లో పెట్టుకుని తాళ్లగొమ్మూరుకు వచ్చారు. అయితే ముందుగానే సమాచారం అందుకున్న బూర్గంపహాడ్ ఎస్ఐ ఇ.నాగ బిక్షం నేతృత్వంలోని పోలీసులు, టాస్క్ఫోర్స్ బృందం ఉమ్మడిగా దాడి చేసి నలుగురినీ రెడ్హ్యాండెడ్గా పట్టుకుని, ఎండిన చిరుతపులి చర్మం, 17 గోర్లు, వాటి రవాణాకు వాడిన బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుల్లో బూర్గంపహాడ్ మండలం తాళ్లగొమ్మూరు, సారపాక చెందిన చల్లా అనిల్కుమార్, పోలవరం జిల్లా చింతూరు మండలం, గమ్మలకోటకు చెందిన కుంజా భద్రయ్య, అదే ప్రాంతానికి మరో ఇద్దరు నిందితులు కుంజా గంగరాజు, మడవి కన్నయ్య లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పాల్వంచ సీఐ సతీష్, టాస్క్ఫోర్స్ సీఐ రమాకాంత్, ఎస్సైలు నాగ బిక్షం, ప్రవీణ్, సుమన్తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.