మహిళల ఆత్మగౌరవంతోనే దేశాభివృద్ధి
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఎంపీ మల్లు రవి మద్దతు
హైదరాబాద్: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మహిళల హక్కులు మరియు వారి స్వతంత్రతపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంపూర్ణ మద్దతు తెలిపారు. మనుధర్మంలోని పరాధీన తత్వ భావజాలం భారతీయ సమాజాన్ని, ముఖ్యంగా మహిళలను తీవ్రంగా బలహీనపరుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
పురుషులతో సమానంగా సాధించే సామర్థ్యం ఉన్నప్పటికీ, పురుషుల కంటే తాము తక్కువ అనే మానసిక భావన (సామాజిక రుద్దింపు) వల్లే మహిళలు వెనుకబడిపోతున్నారని, ఈ రకమైన ఆలోచనా విధానం దేశంలో మహిళా సాధికారతను అణచివేస్తోందని అన్నారు.
తండ్రి, భర్త, కుమారుడిని గౌరవిస్తూనే.. పురుషులతో సమానంగా మహిళలు కూడా స్వతంత్రంగా ఆలోచించి, తమ నిర్ణయాలు తాము తీసుకునే హక్కును వినియోగించుకోవాలని రాహుల్ గాంధీ బహిరంగ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఈ మార్పు భారతీయ సమాజంలో ఒక "రక్తపాతరహిత విప్లవాన్ని" తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళల ఆలోచనా విధానంలో ఈ ఆత్మవిశ్వాసంతో కూడిన మార్పు వచ్చినప్పుడే దేశంలో అపారమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.