తెలంగాణ పోలీసులకు ఎంపీ బంపర్ ఆఫర్?
రమేష్ కొడుకు హిట్ అండ్ రన్ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు:
మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదురుగా జరిగిన హిట్ అండ్ రన్ కేసులో జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజుష్ను కాపాడేందుకు మాదాపూర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. "నా కొడుకుని కేసు నుంచి కాపాడితే ఎంతైనా ఇస్తా" అంటూ ఎంపీ రమేష్ పోలీసులకు భారీ ఆఫర్లు ఇచ్చారనే ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆగస్టు 16వ తేదీన ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న ‘లైఫ్స్టైల్ స్టోర్’ ఉద్యోగి భారతి ముఖి (26)ని సంజుష్ అతివేగంగా కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ యువతి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. రవాణా శాఖ అధికారుల ప్రాథమిక పరిశీలన ప్రకారం ప్రమాద సమయంలో కారు సుమారు 80 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు తెలిసింది.
సాధారణంగా ఇలాంటి ఘటనల్లో BNS 105 మరియు మోటార్ వాహన చట్టం 184 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాల్సి ఉండగా, స్టేషన్ బెయిల్ వచ్చేలా కేవలం BNS 106(1) కింద కేసు నమోదు చేసి, నోటీసులు ఇచ్చి పంపించివేశారు.
స్టేషన్ ఉన్నతాధికారి మరియు లింగమనేని కుటుంబం ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతోనే ఈ సడలింపులు ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. సంజుష్ రక్త నమూనాల ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాకే కొత్త సెక్షన్లు చేరుస్తామని చెప్పడంపై న్యాయనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన రోజే నిందితుడి కుటుంబంతో అధికారులు డీల్ కుదుర్చుకున్నారని సమాచారం. ఐదు రోజుల పాటు ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా, సంజుష్ స్థానంలో ఒక ప్రైవేట్ డ్రైవర్ను నిందితుడిగా చూపి కేసును ముగించేందుకు యత్నించారని మరో ఉన్నతాధికారి తెలిపారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఓ వ్యక్తి తీసిన వీడియో బయటకు రావడంతో అప్రమత్తమైన పోలీసులు ఈ వ్యవహారాన్ని మీడియాకు వెల్లడించారు.
సిసిటీవి కెమెరాలపై అనుమానాలు
అంతటి రద్దీగా ఉండే ఇనార్బిట్ మాల్ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల పూర్తి వివరాలు సేకరించలేకపోయామని రవాణా శాఖ చెప్పడంపై సామాన్య ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని కాపాడేందుకు ఆధారాలు మరియు సీసీటీవీ ఫుటేజీని కూడా మాయం చేశారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.