22A సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీని నడుపనివ్వం
తెలంగాణ ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక
హైదరాబాద్: సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బిఆర్ఎస్ (BRS) సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు 22A (నిషేధిత భూముల జాబితా) సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తానీరు హరీష్ రావు డిమాండ్ చేశారు.
లేకపోతే శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, అసెంబ్లీని ఎలా నడుపుతారో చూస్తామని ఆయన సవాల్ విసిరారు. 22A నిబంధనల వల్ల అనేకమంది భూయజమానులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి వెంటనే న్యాయం చేయాలని పేర్కొన్నారు.
బాధిత ప్రజలకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. ప్రజా సమస్యలపై శాసనసభ లోపల, వెలుపల పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.