గణేష్ ఉత్సవాలు, కృష్ణాష్టమి పై విద్యుత్ శాఖ దృష్టి
గణేష్ ఉత్సవాలు, కృష్ణాష్టమి పై విద్యుత్ శాఖ దృష్టి
విద్యుత్ భద్రతపై అధికారుల ప్రత్యేక సూచనలు
సమన్వయం తో ఏర్పాట్లు చేయండి
అధికారులకు టీజీఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ వి. పాటిల్ ఆదేశం
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు, శ్రీకృష్ణాష్టమి వేడుకలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలు సురక్షితంగా, నిరాటంకంగా నిర్వహించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు సంస్థ సిఎండి జితేష్ వి. పాటిల్ తెలిపారు. జూబ్లీహిల్స్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన గణేష్ ఉత్సవాల సమన్వయ సమావేశంలో టీజీఎస్పీడీసీఎల్ తరఫున పాల్గొన్న సిఎండి విద్యుత్ శాఖ చేపడుతున్న ప్రత్యేక ఏర్పాట్లను వివరించారు.
ఈ సందర్భంగా గతంలో పండుగల సమయంలో చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, భారీ విగ్రహాల ఊరేగింపులు జరిగే మార్గాల్లో విద్యుత్ లైన్లు, ఇంటర్నెట్ కేబుళ్లు, కమ్యూనికేషన్ వైర్లను ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. కిందికి వేలాడుతున్న లేదా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ కేబుళ్లను గుర్తించి, వాటి మరమ్మతులు మరియు సవరణ పనులను ఈ వారంలోనే పూర్తి చేయాలని క్యూర్ పరిధిలోని అన్ని విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా
ట్రాన్స్కో సిఎండి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని 21 సర్కిళ్లలో నిర్వహించిన “బస్తీబాట” కార్యక్రమంలో ట్రాన్స్ఫార్మర్ల వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించడం, విద్యుత్ పరికరాలను పరిశీలించడం, లైన్ క్లియరెన్స్ పనులు చేపట్టడం, వినియోగదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించడం జరిగిందని తెలిపారు.
గణేశ్ శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి నిర్వాహకులు ముందస్తుగా స్థానిక విద్యుత్ అధికారులకు సమాచారం అందిస్తే, ఊరేగింపు మార్గాలను పరిశీలించి అవసరమైన భద్రతా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. పోలీస్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ మరియు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్ సరఫరా, లోడ్ నిర్వహణ, అత్యవసర సేవల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో సమర్థవంతమైన సమన్వయం కోసం వాకీ-టాకీలు, రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలను వినియోగిస్తున్నామని, క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం అందుబాటులో ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తారని సిఎండి పేర్కొన్నారు.
శ్రీకృష్ణాష్టమి ఉట్టి కొట్టే కార్యక్రమాల్లో ప్రత్యేక జాగ్రత్తలు
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్టి కొట్టే కార్యక్రమాల్లో నిర్వాహకులు, భక్తులు విద్యుత్ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని టీజీఎస్పీడీసీఎల్ విజ్ఞప్తి చేసింది. విద్యుత్ లైన్లు, సర్వీస్ వైర్లు, ఇంటర్నెట్ కేబుళ్లకు దూరంగా ఉట్టి ఏర్పాటు చేయాలని , విద్యుత్ తీగలకు సమీపంలో ఉట్టి కట్టరాదని తెలిపారు . ఇనుప పైపులు లేదా లోహ వస్తువులతో ఉట్టి ఏర్పాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని , విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో కార్యక్రమాలు నిర్వహించరాదని
వర్షం లేదా తడి పరిస్థితుల్లో విద్యుత్ పరికరాలను ఉపయోగించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు . తెగిపోయిన లేదా కిందికి వేలాడే విద్యుత్ తీగలు కనిపిస్తే వెంటనే 1912 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలన్నారు . ప్రజల సహకారం, అన్ని శాఖల సమన్వయంతో గణేష్ ఉత్సవాలు, శ్రీకృష్ణాష్టమి వేడుకలు, శోభాయాత్రలు మరియు నిమజ్జన కార్యక్రమాలను సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించేందుకు టీజీఎస్పీడీసీఎల్ కట్టుబడి ఉందని సిఎండి జితేష్ వి. పాటిల్ తెలిపారు.