"చేతకాకపోతే తప్పుకోండి"
ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల్లో జాప్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం
“చేతకాకపోతే తప్పుకోండి.. 4న సీఎం దృష్టికి తీసుకెళ్తా”
యాలాల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 1): మండలంలోని దౌలాపూర్ సమీపంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో జాప్యంపై తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన చేసి ఏడాది పూర్తవుతున్నా పనుల్లో ఆశించిన పురోగతి లేకపోవడంపై ప్రాజెక్టు మేనేజర్ను ప్రశ్నించారు.
“పనులు చేయలేకపోతే బాధ్యతల నుంచి తప్పుకోండి.. మిమ్మల్ని నమ్ముకుంటే నేను మునుగుతా” అంటూ హెచ్చరించారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, సెప్టెంబర్ 4న ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని తెలిపారు. ఇకనైనా పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో యాలాల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహిపాల్, సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, హన్మంత్ ముదిరాజ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అగ్గనూర్ వీరేశం తదితరులు పాల్గొన్నారు.