అవినీతి అభివృద్ధిపై అసెంబ్లీలో తేల్చుకుందాం రండి.. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు మంత్రి అడ్లూరి సవాల్.. ఉనికి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నం.. వెయ్యి రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ కొప్పుల ఈశ్వర్ కి పంపిస్తా.. ప్రోగ్రెస్ రిపోర్టులో తప్పులుంటే దేనికైనా సిద్ధం..
సూర్య కరీంనగర్ ప్రతినిధి:వెయ్యి రోజుల ప్రజాపాలన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకురావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 2023 డిసెంబర్ లో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. వెయ్యి రోజులుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ యాస భాషతో ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీని ఏక వచనంతో సంబోధించడం కేటీఆర్ హరీష్ రావుల అహంకారానికి నిదర్శనమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.పదేళ్లపాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మరో రెండు గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఉచిత విద్యుత్తు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతోపాటు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.