హాజరులో తీవ్ర నిర్లక్ష్యం... ప్రజా పాలనలోనూ మారని తీరు..!
జెండా ఆవిష్కరణకు ఆలస్యంగా చేరుకున్న ఏపీఎం
అర్ధగంట వేచి చూసిన మహిళా సంఘాల ప్రతినిధులు..
ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్
ధారూర్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 17):
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ధారూర్ మండల మహిళా సమైక్య కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆలస్యంగా జరగడం చర్చనీయాంశంగా మారింది.కార్యక్రమం ఉదయం 10 గంటలకు నిర్వహించాల్సి ఉండగా, ఏపీఎం మంజుల వాణి ఆలస్యంగా కార్యాలయానికి చేరుకున్నారని మహిళా సంఘాల ప్రతినిధులు తెలిపారు. దీంతో జెండా ఆవిష్కరణ కోసం అక్కడికి వచ్చిన వారు కొంతసేపు వేచి చూడాల్సి వచ్చిందన్నారు. అనంతరం ఉదయం 10.23 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించారు.ముందుగానే కార్యక్రమ సమయాన్ని తెలియజేసినప్పటికీ సకాలంలో హాజరు కాకపోవడం పట్ల స్థానికులు, మహిళా సంఘాల ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమానికి సమయపాలన పాటించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.గతంలోనూ విధి నిర్వహణలో సమయపాలనపై ఆరోపణలు వచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయమై గతంలో పలు సందర్భాల్లో వార్తలు ప్రచురితమైనప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఏపీఎం మంజుల వాణి వివరణ తెలియాల్సి ఉంది.జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాల నిర్వహణలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, విధి నిర్వహణలో సమయపాలనపై తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.