గోవా గవర్నర్ చేతుల మీదుగా నటుడు నరేష్ అరుదైన సత్కారం.. 55 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ఐదున్నర దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ వర్సటైల్ నటుడు నవరసరాయ డా. నరేష్ విజయకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గోవా రాజ్భవన్లో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో గోవా గౌరవనీయ గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు.. నరేష్ను ఘనంగా సత్కరించారు. భారతీయ సినీ రంగంలో విజయవంతంగా 55 ఏళ్ల సుదీర్ఘ, విశిష్ట ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను శాలువా కప్పి అభినందించడంతో పాటు రాజ్భవన్లో ప్రత్యేకంగా టీ విందును ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరైన గోవాలోని స్థానిక తెలుగు కమ్యూనిటీ సభ్యులు నరేష్కు ఘన స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో నరేష్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంతో పాటు పలు సామాజిక, దౌత్యపరమైన సేవా కార్యక్రమాలను గవర్నర్కు వివరించారు. ప్రస్తుతం ఆయన యునిగోకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్లో అంబాసిడర్గా, ఇండియన్ కమాండ్ హానరరీ కల్నల్ హోదాల్లో దేశానికి సేవలు అందిస్తున్నారు. 1972లో పండంటి కాపురం చిత్రంతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన, 1982లో వచ్చిన నాలుగు స్తంభాలాట సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు ప్రజా జీవితంలోనూ క్రియాశీలక పాత్ర పోషించిన నరేష్, రాయలసీమ ప్రాంతంలో చెరువులు మరియు నీటి వనరుల పునరుద్ధరణ కోసం, అలాగే అంతరించిపోతున్న సంప్రదాయ కళల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లోనూ అదే జోరును కొనసాగిస్తూ టాలీవుడ్లో మోస్ట్ బిజీ నటుడిగా దూసుకుపోతున్న నరేష్, వైవిధ్యమైన క్యారెక్టర్ డ్రైవెన్ పాత్రలతో పాటు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లోనూ కీలకమైన నటుడిగా రాణిస్తున్నారు. ముఖ్యంగా జెన్ జెడ్ ఆడియన్స్లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన, యువ దర్శకుల సినిమాల్లో బోల్డ్ మరియు డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తరాలు మారుతున్నప్పటికీ తనలోని నటుడిని ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకుంటూ సినీ ప్రయాణాన్ని దిగ్విజయంగా సాగిస్తున్న నరేష్ విజయకృష్ణకు గోవా గవర్నర్ చేతుల మీదుగా లభించిన ఈ ఘన సత్కారం పట్ల తెలుగు సినీ ప్రముఖులు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.