వినాయక నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట భద్రత - జిల్లా ఎస్పీ జగదీష్
జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనం కార్యక్రమానికి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా డీజే ఇతర కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని సూచించారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించినట్లుగా వెల్లడించారు. నగరంలోని ఆయా ప్రాంతాలలో ఉన్న విగ్రహాలను తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లను పూర్తి చేశామని అన్నారు. వారికి కేటాయించిన రూట్లోనే నిమజ్జనానికి విగ్రహాలను తరలించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినంగా చర్యలు ఉంటాయన్నారు.