వినాయక నిమజ్జనంలో విషాదం.. చిన్నారి మృతి పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చిన్నారి కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా పరామర్శ…
ధర్మవరం, సెప్టెంబర్ 18:– ధర్మవరం పట్టణంలోని శివనగర్ బ్రహ్మంగారి గుడి వద్ద శుక్రవారం జరిగిన వినాయక నిమజ్జన ఊరేగింపులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్తున్న భక్తులపైకి ఓ ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఏడుగురు గాయపడగా, ఈ ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి వర్షిత మృతి చెందింది.
ఈ విషాద ఘటన సమాచారం అందుకున్న మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు వెంటనే ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులను స్వయంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్య చికిత్సపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి వర్షిత పార్థివదేహాన్ని సందర్శించి హరీష్ బాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి బాధలో తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ గారితో ఫోన్లో చిన్నారి కుటుంబ సభ్యులను మాట్లాడించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, బాధిత కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి ఈ దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, చిన్నారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలు ఒంటరిగా భావించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారి వెంట ఉంటుందని, తాము కూడా వారికి అండగా నిలుస్తామని ధైర్యం చెప్పారు.
వినాయక నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హరీష్ బాబు తెలిపారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీసు, సంబంధిత అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను హరీష్ బాబు కోరారు. బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంలో ఎలాంటి లోటు లేకుండా చూస్తామని హరీష్ బాబు తెలిపారు. మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.