గల్ఫ్ యాత్రికులపై కేరళ పర్యాటక దృష్టి
దుబాయ్ 'అరేబియన్ ట్రావెల్ మార్కెట్'లో భాగస్వామ్యం!
తిరువనంతపురం:గల్ఫ్ ప్రాంతం నుండి పర్యాటకుల రాకను పెంచుకోవడమే లక్ష్యంగా కేరళ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అందులో భాగంగా యూఏఈ పర్యాటక పరిశ్రమ, వాణిజ్య భాగస్వాములతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు దుబాయ్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక 'అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ATM)' ప్రదర్శనలో కేరళ పర్యాటక శాఖ పాల్గొంది. అంతర్జాతీయ ప్రయాణ, పర్యాటక రంగంలో ప్రధాన వాణిజ్య ప్రదర్శనగా పేరొందిన ఈ ఈవెంట్ సెప్టెంబర్ 14 నుండి 17 వరకు దుబాయ్లో జరిగింది.
దుబాయ్లో 'హరిత శాంతి - యల్ల కేరళ' అనే ఇతివృత్తంతో (Theme) నిర్వహించిన ట్రావెల్ మీట్లో కేరళ పర్యాటక శాఖ మంత్రి పి. సి. విష్ణునాథ్ మాట్లాడారు. కేరళలోని బ్యాక్వాటర్స్, తీరప్రాంతాలు, ఆయుర్వేదం, వెల్నెస్, సాహస పర్యాటకం వంటి విశేషాలను ప్రస్తావిస్తూ కేరళ ఏడాది పొడవునా సందర్శించడానికి అనువైన పర్యాటక కేంద్రమని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ఈ నెల చివర్లో జరగబోయే 'కేరళ ట్రావెల్ మార్ట్ 2026'కు రావాల్సిందిగా యూఏఈకి చెందిన ట్రావెల్ ట్రేడ్ ప్రతినిధులను కేరళ పర్యాటక కార్యదర్శి బిజు కె. ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ ఇ. విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'వికసిత్ భారత్' దార్శనికతలో పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. భారత్-యూఏఈ మధ్య పర్యాటక సంబంధాలు మరిన్ని ఎత్తులకు చేరేందుకు తమ కాన్సులేట్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.