కన్నీటి కష్టాలకు 'ఏలూరి' భరోసా!కన్నీటి కష్టాలకు 'ఏలూరి' భరోసా!
కన్నీటి కష్టాలకు 'ఏలూరి' భరోసా!
•ఒకే రోజు 7 కుటుంబాలకు రూ.15.41లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం
•అండగా నిలిచిన ఎమ్మెల్యే ఏలూరి
•సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే సాంబన్న
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
అదో నిరుపేద కుటుంబం.. ఇంట్లో మనిషికి తీవ్ర అనారోగ్యం. చికిత్స చేయించాలంటే లక్షల్లో ఖర్చు. ఆస్తులు అమ్ముకుందామా అంటే సెంటు భూమి లేదు.. అప్పు చేద్దామంటే ఇచ్చే దిక్కు లేదు. కంటినిండా కన్నీరు, గుండెనిండా ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్న వేళ.. 'నేనున్నానంటూ' ఆపన్నహస్తం అందించారు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. నియోజకవర్గంలోని ఏడు నిరుపేద కుటుంబాలకు ఒకే రోజు ఏకంగా రూ.15,41,029 ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) వైద్యసాయం మంజూరు చేయించి వారి మోముల్లో ఆనందం నింపారు.
*ఆపదలో ఆశాకిరణం*
వైద్యం కోసం నిరుపేదలు అప్పులపాలు కాకూడదన్న తపనతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎప్పటికప్పుడు బాధితుల పక్షాన నిలబడుతున్నారు. తన క్యాంప్ కార్యాయంలో జరిగిన ప్రజా దర్బార్ లో వచ్చిన ప్రతి అర్జీని ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి, త్వరితగతిన సీఎం సహాయనిధి మంజూరయ్యేలా సీఎంవో వద్ద స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన చేసిన ప్రత్యేక కృషి ఫలితంగా బుధవారం ఒకే రోజు ఏడు కుటుంబాలకు ఎల్వోసీ లేఖలు జారీ అయ్యాయి. అంత పెద్ద మొత్తంలో పేదల వైద్యానికి ఆర్థిక భరోసా అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
*సేవలోనే సంతృప్తి..*
రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను అత్యంత వేగంగా పరిష్కరిస్తూ పేదలకు ఆర్థిక భరోసా కల్పించడంలో పర్చూరు నియోజకవర్గం ముందువరుసలో ఉంటోంది. ఆపదలో ఉన్నామంటూ ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయం తలుపు తట్టిన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా ఎమ్మెల్యే ఏలూరి అండగా నిలుస్తూ ఆపద్బాంధవుడిగా మారారని నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పెద్ద మొత్తంలో సహాయం అందడంతో బాధిత కుటుంబాలు ఎమ్మెల్యే ఏలూరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాయి.
లబ్ధిదారుల వివరాలు ఇవీ…
మార్తూరు మండలం ద్రోణాదులకు చెందిన గద్దల యేసుమరియమ్మ బిడ్డ చికిత్స నిమిత్తం చిలకలూరిపేట వరలక్ష్మి ఆసుపత్రికి రూ.3,07,860 మంజూరైంది.
పర్చూరుకు చెందిన దేవర్కొండ నాగేశ్వరరావు వైద్యం కోసం గుంటూరు ఆదిత్య ఆసుపత్రికి రూ.49,319 అందింది.
పర్చూరుకే చెందిన షేక్ మస్తాన్వలి చిన్నారి చికిత్సకు వరలక్ష్మి ఆసుపత్రికి రూ.3,54,127 సాయం లభించింది.
అన్నంబొట్లవారిపాలేనికి చెందిన వంకాయలపాటి వీరయ్యకు గుంటూరు అర్క ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అత్యధికంగా రూ.5,00,000 మంజూరైంది.
చెరుకూరుకు చెందిన కొమ్మనబోయిన కామేశ్వరి చికిత్స కోసం విజయవాడ రియా ఆసుపత్రికి రూ.50,289 దక్కింది.
మార్తూరుకు చెందిన కుంచాపు మౌనిక బిడ్డ వైద్యం కోసం వరలక్ష్మి ఆసుపత్రికి రూ.1,53,899 అందింది.
పర్చూరుకు చెందిన వంగిపురం మాణిక్యాలదేవికి అర్క ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం రూ.1,25,535 విడుదలైంది.