జనవరిలో తెనాలి వేదికగా నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేష్
అమరావతి : తెలుగు నాటకరంగానికి, సంస్కృతికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నంది నాటకోత్సవాలను పునఃప్రారంభిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఎండీ విశ్వనాథన్తో కలిసి మంత్రి దుర్గేష్ వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ..నంది నాటకోత్సవాలు కేవలం ప్రదర్శనలు కావు... తెలుగు నాటకరంగ సంస్కృతికి, నటీనటుల ప్రతిభకు పట్టం కట్టే అపూర్వ పండుగ..కళను బతికించే నాటక సమాజాలు, సమాజాన్ని చైతన్యపరిచే కళాకారులు – తెలుగు సంస్కృతికి మూలస్తంభాలు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మార్గదర్శకత్వంలో కళాకారులకు సరైన గుర్తింపునిచ్చేలా ఎఫ్.డి.సి ద్వారా అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కళలకు కాణాచి అయిన గుంటూరు జిల్లా తెనాలిలో జనవరిలో నంది నాటకోత్సవాలు జరుగుతాయి. అవార్డుల ఎంట్రీల కోసం రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి, అక్టోబర్లో సెలక్షన్ కమిటీని నియమిస్తాం. డిసెంబర్లో ప్రాథమికంగా ఎంపికైన నాటకాల జాబితాను ప్రకటిస్తాం. జనవరి 10న ప్రతిష్టాత్మక కందుకూరి అవార్డుల ప్రదానంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం వారం పాటు ఎంపికైన నాటకాల ప్రదర్శనలు, ఆ తర్వాత అత్యంత వైభవంగా నంది నాటకోత్సవాల పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లోని తెలుగు నాటక సమాజాలకు కూడా తొలిసారిగా అవకాశం కల్పిస్తున్నాం.నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) తరహాలో వీడియోల ద్వారా పరిశీలించి పారదర్శకంగా ఎంపిక చేస్తాం.
గతంలో 3గా ఉన్న కందుకూరి ప్రతిష్టాత్మక పురస్కారాలను 5 కి పెంచి, ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున అందజేస్తాం. స్థానం నరసింహారావు, ఆచార్య ఆత్రేయ, గరికపాటి రాజారావు, బండారు రామారావు తదితర దిగ్గజాల పేర్లతో ఈ పురస్కారాలు ఉంటాయి. కొత్తగా ఏర్పాటు అయిన 28 జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లా నుంచి ముగ్గురికి, అలాగే ప్రత్యేక సేవలు అందించిన మరొక 16 మందికి అవార్డులు ఇస్తాం. పద్యనాటకం, సాంఘిక నాటకం, రచయితలు, సాంకేతిక నిపుణులు, నాటక సమాజం కేటగిరీల్లో మొత్తం 100 మందికి/సంస్థలకు కందుకూరి విశిష్ట పురస్కారాలు ఇవ్వనున్నాం. నాటక పరిషత్తులకు ఒక్కో దానికి రూ. 5 లక్షలు ఇచ్చే బదులు, ఎక్కువ మంది కళాకారులకు లబ్ధి చేకూరేలా ఒక్కో పరిషత్కు రూ. 1 లక్ష చొప్పున విస్తృతంగా కేటాయిస్తున్నాం. ఇప్పటికే ఒక పర్యాయం కందుకూరి పురస్కారాలను గత ఏడాది తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 16 న 100 మందికి ఇచ్చాము. చిత్ర పరిశ్రమ, నాటకరంగానికి అవసరమైన అనుమతుల కోసం FDC ద్వారా సింగిల్ విండో విధానం తెచ్చామని తెలిపారు. సినిమా, టీవీ రంగాల నంది అవార్డులకు సంబంధించి ఈ వారంలోనే ప్రకటన విడుదల చేసి, జనవరి నాటికి ప్రదానోత్సవాలు పూర్తి చేస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.పద్య నాటకం, సాంఘిక నాటకం, నాటిక, బాలల నాటిక, కాలేజీ,యూనివర్సిటీ నాటిక, రంగస్థలం మీద బెస్ట్ బుక్ తదితర కేటగిరీల్లో నంది అవార్డులు అందిస్తామని పేర్కొన్నారు..