మహిళా రైతులకు పెరటి తోటల పెంపకం పై శిక్షణ
దువ్వూరు మండలంలో మహిళా రైతులకు పెరటి తోటల పెంపకం పై శిక్షణ.
దువ్వూరు మండలం సంగటి తిమ్మాయపల్లె గ్రామంలో ఏరువాక కేంద్రం, కడప ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో మహిళా రైతులకు కిచెన్ గార్డెన్ నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కడప సమన్వయకర్త డాక్టర్ ఎన్. కృష్ణ ప్రియ పాల్గొని మాట్లాడుతూ కుటుంబ అవసరాలకు సరిపడే విధంగా 5 సెంట్ల స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకునే విధానం గురించి మహిళా రైతులకు వివరించారు. కూరగాయల ఎంపిక, విత్తనాల నాటడం, మొక్కల మధ్య దూరం, సేంద్రియ ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, కలుపు మరియు చీడపీడల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఇంటి అవసరాలకు తాజా, పోషక విలువలు కలిగిన కూరగాయలను తక్కువ ఖర్చుతో పండించుకోవడం ద్వారా కుటుంబ పోషకాహార భద్రతతో పాటు ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో 25 మంది మహిళా రైతులు పాల్గొని కిచెన్ గార్డెన్ ఏర్పాటుపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ ఎం. ప్రకాష్ మరియు అమీర్ తదితరులు పాల్గొన్నారు.