మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం: పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార
నేరేడుచర్లలో పినాకిల్ పాఠశాల విద్యార్థుల భారీ ర్యాలీ*
*నేరేడుచర్ల: మేజర్ న్యూస్*
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని పినాకిల్ పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా శుక్రవారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగుల విగ్రహాలకు స్వస్తి పలికి, పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలను పినాకిల్ పాఠశాల విద్యార్థులు స్వయంగా తయారు చేశారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం మార్గదర్శకత్వంలో విద్యార్థులే స్వయంగా మట్టిని సేకరించి, అత్యంత నైపుణ్యంతో ఈ విగ్రహాలను రూపొందించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పినాకిల్ పాఠశాల విద్యార్థులు నేరేడుచర్ల పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో మట్టి వినాయక విగ్రహాలు, పర్యావరణ నినాదాల ప్లకార్డులు పట్టుకుని పట్టణ పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థులు ఇంటింటికీ తిరుగుతూ మట్టి వినాయక విగ్రహాల ప్రాముఖ్యతను, రసాయన విగ్రహాల వల్ల జరిగే నష్టాలను పట్టణ ప్రజలకు వివరించి, అవగాహన కల్పించారు.
*పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార్ సార్ మాట్లాడుతూ...*
"కేవలం పుస్తకాల్లోని చదువే కాకుండా, సమాజం పట్ల బాధ్యతను, పర్యావరణం పట్ల అవగాహనను పెంపొందించుకోవడమే నిజమైన విద్య అని మన విద్యార్థులు నిరూపించారు. "మట్టి వినాయకుని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం"అనేది కేవలం ఒక నినాదం కాదు, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత కావాలి అని అన్నారు. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల మన నీటి వనరులు కలుషితమై జీవకోటికి ముప్పుగా మారుతున్నాయి అని, ఈ ముప్పు నుండి ప్రకృతిని కాపాడటానికి మన పాఠశాల పిల్లలు ఉపాధ్యాయుల సహాయంతో మట్టిని సేకరించి, తమ చేతులతో వినాయకుడిని మలచడమే కాకుండా, పట్టణంలో భారీ ర్యాలీ ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడం ఎంతో అభినందనీయం అని అన్నారు. ఈ వినాయక చవితికి మనమందరం మట్టి వినాయకులనే పూజించి, పిల్లలు చూపిన ఈ పర్యావరణ హిత మార్గంలో నడుద్దామని పిలుపునిచ్చారు. నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు ప్రజలందరికీ మరియు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.