శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
శ్రీశైలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రంలోని వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్, ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠ ఈ నెల 20న శ్రీశైలానికి వచ్చారు. వడ్డెర సత్రంలో ఓ గదిని అద్దెకు తీసుకున్న వారు అప్పటి నుంచి బయటకు రాలేదు. మూడు రోజులుగా గది తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన సత్రం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గది తలుపులు తెరిచి పరిశీలించగా ఐదుగురు మృతిచెందినట్లు గుర్తించారు. వెంటనే మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పవిత్ర శ్రావణమాసంలో శ్రీశైల పుణ్యక్షేత్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులు, భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.