ఒకే ఘటనతో పలు కేసులు.. భయపడేది లేదు: అంబటి రాంబాబు
కూటమి ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేస్తున్నందుకే తనపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఒకే ఘటనను ఆధారంగా చేసుకుని పలు కేసులు పెట్టి రాజకీయంగా వేధించాలని చూస్తున్నారని విమర్శించారు.
తనపై నమోదైన కేసులన్నీ ప్రస్తుతం ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయని, ఇప్పటివరకు ఏ కేసులోనూ ఛార్జ్షీట్ దాఖలు కాలేదని అంబటి తెలిపారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై సోషల్ మీడియాలో చేసిన పోస్టుల వ్యవహారంలో సీఐడీ కేసుతో పాటు మరో కేసు, తాజాగా పట్టాభిపురం పోలీస్స్టేషన్లో కేసు నమోదైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
టీడీపీ తమ పార్టీపై చేస్తున్న విమర్శలకు రాజకీయ వ్యంగ్యంతోనే తాను సమాధానం ఇచ్చానని అంబటి స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్పై అభ్యంతరకరమైన ఏఐ వీడియోలు, పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదులు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడబోనని, ప్రభుత్వ విధానాలపై తన రాజకీయ విమర్శలు కొనసాగుతాయని అంబటి తేల్చిచెప్పారు. సత్తెనపల్లి, చిలకలూరిపేట, రేపల్లె ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయంటూ పోలీసులపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. రఘురామకృష్ణరాజుపై తాము చేసిన ఫిర్యాదుల విషయంలోనూ చర్యలు తీసుకోలేదని విమర్శించారు.