కోడిపందేలకు వెళ్లి భయంతో పరుగులు... గుండెపోటుతో వ్యక్తి మృతి
కోడిపందేలకు వెళ్లి భయంతో పరుగులు... గుండెపోటుతో వ్యక్తి మృతి
ఇంకా ఆగని కోడిపందాలు.. కొనసాగుతున్న అక్రమ పందేలు
దెందులూరు: దెందులూరులో మంగళవారం రాత్రి జరిగిన కోడిపందాల వద్ద డ్రోన్ లైటింగ్ కనిపించడంతో భయపడిన ఓ వ్యక్తి అక్కడి నుంచి పరుగులు తీసిన ఘటన విషాదానికి దారితీసింది. తీవ్రంగా పరుగెత్తడంతో ఆయాసానికి గురైన ఆ వ్యక్తి అనంతరం గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం.
స్థానికుల సమాచారం ప్రకారం... కోడిపందాలు జరుగుతున్న ప్రాంతంలో డ్రోన్ లైటింగ్ కనిపించడంతో పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయన్న భయంతో పలువురు అక్కడి నుంచి పరుగులు తీశారు. వారిలో ఓ వ్యక్తి తీవ్రంగా పరుగెత్తడంతో ఆయాసానికి గురయ్యాడు. అనంతరం సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ మరుసటి రోజు కూడా ఆయాసం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో ఈసీజీ పరీక్ష నిర్వహించిన అనంతరం చికిత్స అందిస్తూ సెలైన్ ఎక్కిస్తున్న సమయంలోనే ఆయన మృతి చెందినట్లు సమాచారం. గుండెపోటుతోనే మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ, మృతికి సంబంధించిన పూర్తి వైద్య కారణాలు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
ఆగని కోడిపందాలు
ఒకవైపు కోడిపందాల నిర్వహణపై పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, మరోవైపు దెందులూరు పరిసర ప్రాంతాల్లో కోడిపందాలు కొనసాగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా నిర్వహిస్తున్న పందాలను అరికట్టాలని ప్రజలు పోలీసు అధికారులను కోరుతున్నారు.