భారత్ మండపానికి చేరుకున్న ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్
న్యూఢిల్లీ: భారతదేశం అధ్యక్షతన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో కలసి సమావేశ వేదికైన భారత్ మండపానికి చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ అల్ నహ్యాన్లతో పాటు ఇతర బ్రిక్స్ దేశాల అగ్రనేతలు సదస్సు ప్రాంగణానికి విచ్చేశారు.
ఈ శిఖరాగ్ర సమావేశంలో భాగంలో నాయకులు “సమ్మిళిత ప్రపంచ పాలన మరియు బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం” అనే అంశంపై ప్రత్యేక రహస్య సమావేశాన్ని నిర్వహించనున్నారు. అలాగే భారత్ సాధించిన సాంకేతిక పురోగతిని ప్రతిబింబించే 'భారత్ ఇన్నోవేట్స్' ప్రదర్శనను నాయకులు వీక్షించనున్నారు. "స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం" అనే ప్రధాన ఇతివృత్తంతో భారత్ ఈ రెండు రోజుల సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది.
సదస్సు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తొలిసారి భారత్లో పర్యటిస్తున్న ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ అలీతో భేటీ అయి రక్షణ, సామర్థ్య పెంపు, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం మరియు ఆరోగ్య రక్షణ అంశాలపై చర్చించారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జరిగిన సమావేశంలో భారత్-మలేషియా రక్షణ భాగస్వామ్యం, పెట్టుబడుల విస్తరణపై సమీక్షించారు. గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను కాపాడటంలో ఈ బ్రిక్స్ సదస్సు కీలక ఘట్టంగా నిలవనుంది.