'విశేషాధికారాల పిరమిడ్' స్థానంలో 'భాగస్వామ్య వేదిక' రావాలి
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: ప్రపంచ పాలనలో ప్రస్తుతం కొనసాగుతున్న 'విశేషాధికారాల పిరమిడ్' వ్యవస్థ స్థానంలో ప్రతి దేశానికి భాగస్వామ్యం ఉండే 'భాగస్వామ్య వేదిక' రావాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీ వేదికగా శనివారం ప్రారంభమైన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సహా పలువురు అగ్రనేతల సమక్షంలో ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాలు కేవలం 'నియమాలను పాటించేవిగా' కాకుండా 'నియమాలను రూపొందించే శక్తిగా' ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 సూత్రాల రోడ్మ్యాప్ను ప్రధాని ఆవిష్కరించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలతో పాటు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో గ్లోబల్ సౌత్ ఓటింగ్ హక్కులను పెంచాలని, కృత్రిమ మేధ, సైబర్స్పేస్, అంతరిక్ష రంగాల నిబంధనల్లో సమాన భాగస్వామ్యం ఉండాలని కోరారు. అలాగే సముద్ర ప్రమాదాలు, ఉద్రిక్తతల వేళ నావికులను రక్షించేందుకు 'నావికుల అత్యవసర సహాయక నెట్వర్క్'ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న బ్రిక్స్ కూటమి రాబోయే రెండు దశాబ్దాలకు కావలసిన కొత్త, స్పష్టమైన అజెండాతో ముందుకు సాగాలని మోదీ సూచించారు.