చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ‘నేతన్నల సేవలో’ పథకానికి ఆమోదం
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'నేతన్నల సేవలో' పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 25,000 ఆర్థిక సహాయం అందించనుంది.
వస్త్ర పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ నూస్ చెప్పింది. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు వృత్తిని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో సరికొత్త సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘నేతన్నల సేవలో’ అనే నూతన పథకానికి అధికారికంగా ఆమోద ముద్ర పడింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది చేనేత కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది.
అధికారిక వివరాల ప్రకారం, దారిద్య్ర రేఖకు దిగువన (BPL) జీవిస్తున్న అర్హులైన చేనేత కార్మికులకు ఈ పథకం వర్తింపజేయనున్నారు. ఈ సహాయాన్ని పొందేందుకు ఎలాంటి వయోపరిమితి నిబంధన పెట్టకపోవడం గమనార్హం. అలాగే కుటుంబం వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఈ సాయం అందనుంది. చేనేత రంగానికి అవసరమైన రంగులు, రసాయనాలు, నూలు కొనుగోలుతో పాటు పరికరాల ఆధునికీకరణ కోసం ఈ ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ. 25,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని నేరుగా అందించనున్నారు. ఈ విధానం ద్వారా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కానుంది. ఈ సంక్షేమ కార్యక్రమం అమలు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 51,952 మందికి పైగా చేనేత కార్మికులు ప్రయోజనం పొందనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి వార్షిక బడ్జెట్లో తగిన కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.