పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
మాజీ మంత్రుల ధ్వజం
నాగర్ కర్నూలు: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, శ్రీశైలంలో సరిపడా నీరు ఉన్నప్పటికీ కల్వకుర్తి ద్వారా పూర్తిస్థాయిలో నీటిని ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు.
పగటిపూట మోటార్లు నడిపి రాత్రి వేళల్లో విద్యుత్ నిలిపివేస్తుండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, ఒక్కో మోటారుతో కాలం వెళ్లదీస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎత్తిపోతల మోటార్లకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను భారీగా పెన్నా బేసిన్కు తరలిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
గత ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాల్వల నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళనపై ఉన్న శ్రద్ధ పాలమూరు సాగునీటిపై లేదని, ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే విద్యుత్ కోసం రైతులు రోడ్డెక్కడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కల్వకుర్తి మోటార్లను నిరంతరం నడపకపోతే రైతులతో కలిసి పంపింగ్ స్టేషన్ల వద్ద వంటావార్పు చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.