BREAKING
అర్జెంటీనాలో వింత దృశ్యం.. రాత్రికి రాత్రే కిలోమీటర్ల కొద్దీ వెనక్కి తగ్గిన సముద్రం.. బయటపడ్డ పురాతన రాతి నిర్మాణాలు భారత్ మండపంలో 37 భారతీయ డీప్-టెక్ స్టార్టప్‌ల ప్రదర్శన డిడి ఇండియా 'ది ఎకనామిక్ బ్రీఫ్' ఆచార్య వినోబా భావే 'జై జగత్' పిలుపు మానవత్వాన్ని ఉన్నతంగా నిలిపింది ఉమ్మడి పురోగతికి భారత్, ఇరాన్ కృషి: విదేశాంగ శాఖ ప్రకటన న్యూఢిల్లీకి చేరుకున్న నైజీరియా ఉపాధ్యక్షుడు కాశీమ్ షెట్టిమా థియేటర్లలోకి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’.. తొలి రివ్యూలు ఎలా ఉన్నాయంటే! ఢిల్లీకి చేరుకున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ భారత్ మండపంలో బ్రిక్స్ భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్‌పోజిషన్ ప్రారంభం ఉరుగ్వే విదేశాంగ మంత్రితో ఎస్.జైశంకర్ భేటీ రష్యా ఉప ప్రధానితో నిర్మలా సీతారామన్ భేటీ టాలీవుడ్‌లోకి బాలీవుడ్ సంచలన చిత్రం.. తెలుగులో ‘హనుమాన్ అంశ్’ విడుదల తేదీ ఖరారు! భారతదేశంలో 80 లక్షల మార్కును దాటిన హెచ్‌పివి వ్యాక్సినేషన్లు బ్రెజిల్ విదేశాంగ మంత్రితో ఎస్. జైశంకర్ భేటీ భారత్, రష్యాగ్రూప్ కీలక సమావేశం.. ఢిల్లీ వేదికగా మోదీ, పుతిన్ ఉన్నత స్థాయి చర్చలు

అసెంబ్లీలో కులగణనపై భట్టి ఫైర్

Select Suryaa Now
అసెంబ్లీలో కులగణనపై భట్టి ఫైర్

హైదరాబాద్‌: దేశంలో సామాజిక అసమానతలను తొలగించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే జనగణనలో కులగణనను తప్పనిసరిగా చేర్చాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జనగణన, కులగణన అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కులగణన చేద్దామా? వద్దా? అనే విషయాన్ని బీజేపీ సభ్యులు సూటిగా చెప్పాలని కోరారు.

కులగణన అనేది కులాలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదని.. సమాజ శ్రేయస్సుకు సంబంధించిన విషయమని భట్టి పేర్కొన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించాలంటే ముందుగా వాటి తీవ్రత, స్వభావాన్ని తెలుసుకోవాలని, అందుకు కులగణన కీలకమని అన్నారు.

తెలంగాణ సర్వే దేశానికి ఆదర్శం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సమగ్ర సర్వే నిర్వహించామని భట్టి తెలిపారు. ఏ కులానికి ఎంత జనాభా ఉంది, వారి ఆర్థిక పరిస్థితి, విద్య, ఉద్యోగాలు, నిరుద్యోగం, భూమి తదితర అంశాలను సర్వే ద్వారా సేకరించామని చెప్పారు. తెలంగాణలో నిర్వహించిన ఈ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

తెలంగాణ మోడల్‌లో దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కాంగ్రెస్ మొదటి నుంచీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని, వివిధ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించి తెలంగాణలో చేపట్టిన సర్వే విధానాన్ని వివరించామని చెప్పారు.

బీజేపీ సభ్యులు స్పష్టంగా చెప్పాలి

జనగణనలో కులగణనను చేర్చుతామని గతంలో కేంద్రం చెప్పిందని భట్టి గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో కులగణనను చేర్చకపోవడం బాధాకరమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కులగణనను జనగణనలో భాగం చేయాలని డిమాండ్ చేశారు.

‘‘కులగణన చేద్దామా? వద్దా? బీజేపీ సభ్యులు సూటిగా చెప్పాలి. అనుకూలమైతే సభ తరఫున కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి పిలుపునివ్వాలి. వ్యతిరేకమైతే అదే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి’’ అని భట్టి అన్నారు.

కులగణన ఒక ఎక్స్‌రే

సమాజంలో ఆస్తులు, వనరులు అందరికీ సమానంగా అందడం లేదని భట్టి పేర్కొన్నారు. అసమానతలను గుర్తించేందుకు కులగణన అవసరమన్నారు. ‘‘సమాజం ఆరోగ్యంగా లేకపోతే ముందుగా ఎక్స్‌రే తీయాలి. వ్యాధిని నిర్ధారించాలి. ఆ తర్వాతే చికిత్స చేయాలి. సమాజంలో ఉన్న అసమానతలను గుర్తించే ఎక్స్‌రేనే కులగణన’’ అని వ్యాఖ్యానించారు.

కులగణన ద్వారా వివిధ సామాజిక వర్గాల వాస్తవ జనాభా, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయని, ఆ సమాచారంతో సంక్షేమ, అభివృద్ధి విధానాలను రూపొందించవచ్చని చెప్పారు.

రాహుల్‌ ప్రధాని అవుతారు

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా తెలంగాణ తరహాలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే నిర్వహిస్తామని ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన నిధులు, వనరులు, అవకాశాలు అందరికీ న్యాయంగా చేరేలా విధానాలు రూపొందిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.