భారతదేశంలో 80 లక్షల మార్కును దాటిన హెచ్పివి వ్యాక్సినేషన్లు
న్యూఢిల్లీ:దేశంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్పివి (HPV) టీకా పంపిణీ మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 80 లక్షల హెచ్పివి వ్యాక్సినేషన్లను విజయవంతంగా పూర్తి చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది.
నివారణ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం, హెచ్పివి ఇన్ఫెక్షన్లు మరియు గర్భాశయ ముఖద్వార (సివికల్) క్యాన్సర్ నుండి రక్షణ కల్పించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. "ప్రతి వ్యాక్సినేషన్తో భారతదేశం తన కుమార్తెల కోసం ఆరోగ్యకరమైన, క్యాన్సర్ రహిత భవిష్యత్తు వైపు సాగుతోంది" అని సోషల్ మీడియా వేదిక 'X'లో పేర్కొంది.
14 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం ఈ దేశవ్యాప్త ఉచిత హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్లోని అజ్మీర్ నుండి ప్రారంభించారు. రాబోయే రోజుల్లో దేశంలో గర్భాశయ క్యాన్సర్ భారాన్ని తగ్గించడమే ఈ ప్రచారం ముఖ్య లక్ష్యం.
టీకాతో క్యాన్సర్ నిర్మూలన సాధ్యం:డా.దత్తాత్రేయుడు నోరి
ఈ హెచ్పివి టీకాతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్పై పోరాటంలో భారతదేశానికి గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని ప్రసిద్ధ భారతీయ-అమెరికన్ ఆంకాలజిస్ట్, పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ దత్తాత్రేయుడు నోరి హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రతిరోజూ సుమారు 200 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్తో మరణిస్తున్నారని, అయితే ఇది నివారించగల మరియు పూర్తిగా నయం చేయగల వ్యాధి అని ఆయన పేర్కొన్నారు. ఉచిత హెచ్పివి టీకాల ద్వారా రాబోయే కొన్నేళ్లలో భారత్ నుండి ఈ క్యాన్సర్ను పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.