కీలక ఖనిజాలు దేశ రక్షణ, ఇంధన భద్రతకు అత్యంత ముఖ్యం
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ:భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం మరియు జాతీయ భద్రతకు కీలక ఖనిజాలు, అధునాతన పదార్థాలు అత్యంత అవసరమైన వ్యూహాత్మక ఆస్తులని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆధ్వర్యంలో జరిగిన '3వ గ్లోబల్ సమ్మిట్ ఆన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినిరల్స్ అండ్ మెటల్స్' ప్రత్యేక ప్లీనరీలో ఆయన మాట్లాడారు.
స్వచ్ఛ ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, సెమీకండక్టర్లు, టెలికామ్, ఏరోస్పేస్, రక్షణ మరియు అణుశక్తి రంగాల పరివర్తనకు ఈ ఖనిజాలు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఖనిజాల అన్వేషణ, వెలికితీత నుంచి ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, తయారీ వరకు మొత్తం విలువ గొలుసులో దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యూహాత్మక సాంకేతికతలు, పెట్టుబడుల కోసం అణు రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడమే ఒక ముఖ్యమైన పరిణామమని, ఇందులో భాగస్వాములు కావాలని కెనడా సహా అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానించారు. పరిశోధన, ఆవిష్కరణల తొలిదశలోనే పరిశ్రమలు భాగస్వామ్యం కావాలని, ఆర్డీఐ నిధి మరియు ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ప్రపంచశక్తిగా ఎదుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.