పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది
జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్
నాగర్ కర్నూల్: పదోన్నతి పొందిన ప్రతీ అధికారి నిజాయితీ, క్రమశిక్షణతో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సూచించారు. పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఎస్ఐగా పదోన్నతి పొందిన ఎండి. ఖలీల్ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ తన చేతుల మీదుగా ఖలీల్కు ఎస్ఐ హోదాకు సంబంధించిన స్టార్స్ అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పదోన్నతి అనేది కేవలం ఉన్నత స్థానానికి ఎదగడం మాత్రమే కాదని, దాంతోపాటు బాధ్యతలు మరింత పెరుగుతాయని స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది క్రమశిక్షణ, సేవాభావంతో వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందేలా సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఏవో కృష్ణయ్య మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.