|
|
by Suryaa Desk | Sun, Jan 18, 2026, 09:00 PM
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్న అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడు ఆహార భద్రతకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
రేషన్ కార్డుల మంజూరుపై స్పష్టత..
గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మందికి కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేసింది. ఇంకా ఎవరికైనా రేషన్ కార్డులు లేకపోతే.. ప్రభుత్వం త్వరలోనే కొత్త దరఖాస్తులను స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి కార్డులను అందజేయనుంది. కేవలం బియ్యం కోసమే కాకుండా.. ప్రభుత్వ ఇతర సంక్షేమ పథకాలు పొందడానికి కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా ఉండటంతో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖమ్మం జిల్లా అభివృద్ధి పనులు..
రేషన్ కార్డుల ప్రకటనతో పాటు.. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 362 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఏదులాపురంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల మరియు కొత్తగా నిర్మించిన నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పునాది వేశారు. మద్దులపల్లిలో నూతన మార్కెట్ యార్డును జాతికి అంకితం చేశారు. మున్నేరు నుండి పాలేరు వరకు లింక్ కెనాల్ పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యం..
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నర్సింగ్ విద్యార్థులతో మాట్లాడిన సీఎం, వారికి విదేశీ ఉపాధి అవకాశాల కోసం జపనీస్, జర్మన్ భాషల్లో శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే భద్రాచలం ఆలయాన్ని అయోధ్య తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించి భక్తుల్లో ఉత్సాహం నింపారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ద్వారా అర్హులకు సంక్షేమ ఫలాలు నేరుగా అందుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.