‘మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇంత అవమానించారు?’
రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కొండా సుష్మిత
హైదరాబాద్: "మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇంతగా అవమానించారు? అమ్మా, నాన్నా నన్ను క్షమించండి.." అంటూ మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత కన్నీటిపర్యంతమయ్యారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యల వల్ల తన తల్లికి అవమానం జరుగుతుందని తెలిస్తే మాట్లాడేదాన్ని కాదని సుష్మిత వాపోయారు.
"నేను మాట్లాడిన మాటల్లో తప్పు లేదని ఇప్పటికీ చెప్తున్నాను. ఒకవేళ తప్పు ఉంటే నాపై అక్రమ కేసులు పెట్టి నన్ను జైల్లో వేయాల్సింది. అంతే తప్ప మా అమ్మను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?" అని ప్రశ్నించారు. "పార్టీలో నేనైనా ఉండాలి, ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి ఒక ముఖ్యమంత్రి దిగజారుతాడని అనుకోలేదు. ఒక సామాన్య కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన మహిళపై రేవంత్ రెడ్డికి ఇంత పగ ఎందుకు?" అని నిలదీశారు.
తన తల్లి శాఖలో చిన్న అవినీతి కూడా జరగలేదని, రేవంత్ మీడియా కావాలనే ఆమె స్థాయిని తగ్గించి చూపిస్తోందని ఆరోపించారు. ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదని హెచ్చరించారు.ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్న తన తండ్రిగానీ, తన తల్లిగానీ రేవంత్ రెడ్డిని తిట్టమని తనకు చెప్పారనడంలో నిజం లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధిష్ఠానం మొత్తం తన తల్లికే మద్దతుగా ఉందని, కానీ రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయం చేయడం వల్లే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎంత అవమానం జరిగినా తన తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని సుష్మిత స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సోదరుల అక్రమాల చిట్టా తన వద్ద ఉందని, దాని గురించి త్వరలోనే మాట్లాడతానని ఆమె వెల్లడించారు.