ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలుడు కిడ్నాప్.. నిజామాబాద్లో కలకలం
సూర్య వేల్పూర్ :
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు కిడ్నాప్కు గురైన ఘటన కలకలం రేపింది. బాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన కుటుంబం వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.ఆసుపత్రిలో ఉన్న సమయంలో గుర్తు తెలియని మహిళ బాలుడి వద్దకు వచ్చి చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి అతడిని వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆసుపత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి కిడ్నాప్ ఘటనతో రోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆసుపత్రి ప్రాంగణంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు కోరుతున్నారు.