నిజామాబాద్లో తీవ్ర ఉద్రిక్తత.. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు, ఆన్లైన్ విధానం రద్దు చేయాలని డిమాండ్
తెలంగాణలో మరోసారి అన్నదాతల కష్టాలు రోడ్డున పడ్డాయి. పంట సాగు ఊపందుకుంటున్న తరుణంలో ఎరువుల కొరత రైతన్నలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి సహకార సంఘం (సొసైటీ) వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యూరియా సకాలంలో అందక, రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న ఆన్లైన్ బుకింగ్ విధానం తమకు శాపంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడం కష్టంగా మారుతోందని, వెంటనే ఈ విధానాన్ని ఎత్తివేసి పాత పద్ధతిలోనే నేరుగా యూరియా అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎంతో కష్టపడి పండించే పంట చేతికి వచ్చే సమయంలో ఎరువుల కోసం ఈ విధంగా రోడ్డెక్కాల్సి రావడంపై రైతు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి యూరియా కొరతను నివారించాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.