ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి
‘భారత్ను నైపుణ్య రాజధానిగా, జ్ఞాన సూపర్పవర్గా మార్చాలి’
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ రాజధాని న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా ప్రతిభ చూపిన ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా (Global Skill Capital), జ్ఞాన సూపర్పవర్గా (Knowledge Superpower) తీర్చిదిద్దడమే మన జాతీయ ప్రాధాన్యత అని పిలుపునిచ్చారు. రాజ్యాంగం అందించిన అవకాశాల సమానత్వ ఆదర్శాన్ని సాకారం చేయడానికి విద్యే అత్యంత ప్రభావవంతమైన సాధనమని ఆమె ఉద్ఘాటించారు.
ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటును దాదాపుగా శూన్యానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయుల కృషిని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల విద్య విద్యా వ్యవస్థకు పునాది అని, బాల్యంలో నేర్పే సత్ప్రవర్తన, నైతిక వికాసమే భవిష్యత్ తరాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయని ఆమె పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చే మొదటి తరం విద్యార్థులు, గ్రామీణ నేపథ్యం ఉన్న పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం ఉపాధ్యాయుల బాధ్యత అని స్పష్టం చేశారు.
ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ ద్వారానే 'వికసిత భారత్' కల సాకారమవుతుందని, దేశంలో ఒక్క విద్యార్థి కూడా నాణ్యమైన విద్యకు దూరం కాకూడదని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులే విద్యా వ్యవస్థకు జీవమని, తమ ఆప్యాయత, అంకితభావంతో విద్యార్థుల్లో జ్ఞానం, సృజనాత్మకత, నైతిక విలువలను పెంపొందించాలని రాష్ట్రపతి ముర్ము ఆకాంక్షించారు.