ఇన్స్టా మిస్డ్కాల్తో పట్టుబడిన కిడ్నాపర్.. మూడు నెలల తర్వాత గుంటూరు బాలిక రెస్క్యూ
గుంటూరులో సంచలనం సృష్టించిన బాలిక అపహరణ ఉదంతం సుఖాంతమైంది. మూడు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి రాష్ట్రాలు మారుతూ తిరుగుతున్న కిడ్నాపర్.. ఇన్స్టాగ్రామ్లో ఇచ్చిన ఒకే ఒక్క మిస్డ్కాల్తో పోలీసులకు చిక్కాడు. పక్కా ప్రణాళికతో పదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసిన షేక్ జాన్సైదా ఎట్టకేలకు పోలీసుల వలసలో చిక్కాడు.
అసలు ఏం జరిగిందంటే..
గుంటూరు నగరంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలికను జూన్ 9న షేక్ జాన్సైదా అపహరించాడు. ఈ కిడ్నాప్నకు ముందే నిందితుడు గుంటూరులోని ఓ లాడ్జిలో వారం రోజులు బస చేసి ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసి, వేరే వ్యక్తి పేరుతో సిమ్ కార్డులు సమకూర్చుకున్నాడు. వాటి ద్వారానే బాలికకు మెసేజ్లు పంపి ట్రాప్ చేశాడు. బాలిక ఇంటి నుంచి వెళ్లే సమయంలో తన ఫోన్లోని డేటాను డిలీట్ చేసి మురుగు కాలువలో పడేసింది.
పోలీసుల కళ్లుగప్పి..
కిడ్నాప్ తర్వాత నిందితుడు సాధారణ ఫోన్ కాల్స్ను పూర్తిగా పక్కన పెట్టాడు. దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి ఇన్స్టాగ్రామ్ను మాత్రమే నమ్ముకున్నాడు. ఈ క్రమంలో బాలిక మూడు ఇన్స్టా ఖాతాలు, జాన్సైదా ఏడు ఇన్స్టా ఖాతాలు మార్చారు. గుంటూరు నుంచి నెల్లూరు, చెన్నై, కోయంబత్తూరు, కేరళ, హైదరాబాద్ మీదుగా హరియాణా వరకు వివిధ ప్రాంతాలు మారుతూ పోలీసులకు సవాల్ విసిరాడు. హైదరాబాద్లో బంధువుల ఇంట్లో ఆశ్రయం పొంది, బంగారం విక్రయించేందుకు కూడా ప్రయత్నించారు. ఈ పరారీలో కొందరు స్నేహితులు, బంధువులు నిందితుడికి సహకరించినట్లు తేలింది.
హైకోర్టు ఒత్తిడితో వేగవంతమైన దర్యాప్తు..
బాలిక అదృశ్యంపై ఆమె తండ్రి ఇటీవల హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలను మరింత తీవ్రం చేశారు.
మిస్డ్కాల్ ఇచ్చిన కిలుకు మలుపు..
ఈ కేసులో గురువారం రాత్రి బాలిక ఇన్స్టా ఖాతా నుంచి తల్లిదండ్రులకు ఒక మిస్డ్కాల్ వచ్చింది. వెంటనే ఆ ఫోన్ స్విచ్చాఫ్ అయింది. ఈ ఒక్క మిస్డ్కాల్ను ఆధారంగా చేసుకున్న పోలీస్ ఐటీ విభాగం.. నిందితుడి లొకేషన్ను ట్రేస్ చేసింది. హరియాణా రాష్ట్రం కర్నాల్ బుధాఖేరాలోని ఓ హోటల్లో వారు ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం ఉదయమే రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందం.. హరియాణా పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం నిందితుడిని గుంటూరుకు తరలిస్తున్నారు. జాన్సైదాపై ఇప్పటికే పర్చూరు స్టేషన్లో ఒక దాడి కేసు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.