1,344కు చేరిన మృతుల సంఖ్య.. 4,900 మంది గల్లంతు
కాఠ్మాండూ: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు శోకసంద్రాన్ని మిగిల్చాయి. బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతుండగానే మృతుల సంఖ్య శనివారం నాటికి 1,344కు చేరుకుంది. ఉత్తర, మధ్య నేపాల్ పరిధిలోని పలు జిల్లాల్లో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు 4,900 మంది ఆచూకీ లభించకపోవడంతో మృతుల సంఖ్య మరిన్ని పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు వద్ద మంచు-రాళ్ల చరియలు విరిగిపడటంతో భోటెకోషి నదిలో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ ప్రళయంలో వేలాది ఇళ్లు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోగా, జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాలలో 758 మంది పెద్దలు, 85 మంది పిల్లలు కాగా, మరో 501 మృతదేహాలు ఛిద్రమైన స్థితిలో దొరికాయి. అత్యధికంగా చిత్వాన్ జిల్లా నుంచే 360 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన 4,898 మంది కోసం నేపాల్ సైన్యం నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన వారిలో రసువా, నువాకోట్ జిల్లాలకు చెందిన 600 మందికి పైగా పిల్లలు ఉన్నారు.
జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో వందలాది మంది చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. ఈ సహాయక చర్యల్లో నేపాల్ బృందాలకు భారత్, చైనా నిపుణులు సహాయం అందిస్తున్నారు. భారత రెస్క్యూ బృందం రసువా జిల్లాలోని చిలిమే సొరంగం వద్ద తాత్కాలిక ట్రాక్ను సిద్ధం చేసింది. శుక్రవారం త్రిశూలి 3A జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం నుంచి ఇద్దరు వ్యక్తులను రెస్క్యూ బృందాలు సజీవంగా కాపాడాయి. ఇప్పటివరకు మొత్తం 13,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ విపత్తు ధాటికి చైనా సరిహద్దు ప్రాంతాల్లో కనీసం 21 మంది మరణించగా, టిబెట్లో 500 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రస్తుతం కోషి, నారాయణి, బగ్మతి సహా ప్రధాన నదుల్లో నీటిమట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, నిరాశ్రయులైన ప్రజలకు సహాయక చర్యలు వేగవంతం చేశారు.