భారత్ డిజిటల్, ఆర్థిక రంగాలు అత్యంత సురక్షితం
న్యూయార్క్లో గ్లోబల్ సీఈఓలతో ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూయార్క్:భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక సేవల రంగాలలో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను వినియోగించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్లో పలువురు గ్లోబల్ కంపెనీల సీఈఓలతో ఆమె వరుస సమావేశాలు నిర్వహించారు.
సంస్థ చైర్మన్, సీఈఓ సంజీవ్ అహుజాతో జరిగిన భేటీలో ఏఐ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లు మరియు డిజిటల్ సర్వీసుల రంగాల్లో భారత్లో ఉన్న డిమాండ్ను మంత్రి వివరించారు. భారత్లో భారీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్లను అభివృద్ధి చేసేందుకు టిల్మాన్ హోల్డింగ్స్ వంటి సంస్థలకు సరైన అవకాశాలు ఉన్నాయన్నారు.
మార్ష్ రీ సీఈఓ డీన్ క్లిసురాతో ఆర్థిక మంత్రి చర్చలు జరిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, డిజిటల్ సామర్థ్యాలు భారత్లో పుష్కలంగా ఉన్నాయన్నారు. కాగా, గిఫ్ట్ సిటీ (GIFT City) వేదికగా తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు మార్ష్ రీ సుముఖత వ్యక్తం చేసింది.
గ్రూప్ సీఓఓ అలెజాండ్రో పెరెజ్తో జరిగిన సమావేశంలో భారత్ ఆర్థిక స్థిరత్వంపై చర్చలు జరిగాయి. బీఎన్వై మెల్లన్కు భారత్ కేవలం సేవలందించే కేంద్రం మాత్రమే కాకుండా, ఏఐ మరియు సాంకేతిక ఆవిష్కరణలకు వ్యూహాత్మక గ్లోబల్ హబ్గా మారిందని పెరెజ్ తెలిపారు. ఐఐటీల భాగస్వామ్యంతో నాణ్యమైన ప్రతిభను వెలికితీస్తున్నామని పేర్కొన్నారు.
గుజరాత్లోని 'గిఫ్ట్ సిటీ-ఐఎఫ్ఎస్సీ' (GIFT City-IFSC) ని సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న ఆధునిక ఆర్థిక సేవా వాతావరణాన్ని పరిశీలించాల్సిందిగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను సీతారామన్ ఆహ్వానించారు.