నాణ్యత లో రాజీ వద్దు.. పనులు వేగంగా పూర్తి చేయాలి
దౌల్తాబాద్లో అభివృద్ధి పనుల పరిశీలన.. హకీంపేటలో కొడంగల్ అభివృద్ధిపై సీఎం సమీక్ష
దౌల్తాబాద్/దుద్యాల మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 04): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం దౌల్తాబాద్ మండలంలో పర్యటించారు. గోకఫస్లాబాద్లో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న బీసీ రెసిడెన్షియల్ పాఠశాల, దౌల్తాబాద్లో రూ.4.80 కోట్లతో చేపడుతున్న జూనియర్ కళాశాల పనులను పరిశీలించారు. నాణ్యతలో రాజీ లేకుండా, పటిష్టంగా పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హనుమాన్ దేవాలయం వద్ద ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.అనంతరం హకీంపేటలో 200 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ను పరిశీలించి, కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్, రేడియల్ రోడ్డు, పారిశ్రామిక ప్రాజెక్టు, రోడ్లు, హౌసింగ్, తాగునీరు, విద్య, వైద్యం తదితర పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. 81 కి.మీ. రేడియల్ రోడ్డు భూసేకరణను అక్టోబర్లోగా పూర్తి చేసి నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభించాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి తండాకు రహదారి ఉండేలా చర్యలు తీసుకోవాలని, అన్ని పనులను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి, వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి, నారాయణపేట కలెక్టర్ ప్రియాంక, ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.