నాణ్యతలో రాజీ వద్దు... పనులు పటిష్టంగా చేపట్టాలి
సీఎం రేవంత్ రెడ్డి
బీసీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
దౌల్తాబాద్, మేజర్ న్యూస్(సెప్టెంబర్ 04):దౌల్తాబాద్ మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గోకఫస్లాబాద్లో రూ.25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బీసీ రెసిడెన్షియల్ పాఠశాల, దౌల్తాబాద్ మండల కేంద్రంలో రూ.4.80 కోట్ల వ్యయంతో చేపడుతున్న జూనియర్ కళాశాల నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి లోపాలకు తావులేకుండా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పటిష్టంగా పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నూతన సాంకేతికతను వినియోగిస్తూ విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతులు కల్పించేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
*సీఎంకు ఘన స్వాగతం*
గోకఫస్లాబాద్ హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, డీఐజీ చందన దీప్తి, ఇన్చార్జ్ ఎస్పీ పారితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
*ప్రజలను ఆప్యాయంగా పలకరించిన సీఎం*
జూనియర్ కళాశాల పనులను పరిశీలించిన అనంతరం హనుమాన్ దేవాలయం వద్ద గుమికూడిన ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి పలకరించారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి, కాడ అధికారి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, డీసీసీ కార్యవర్గ సభ్యులు జంగం వీరన్న, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, ప్రమోద్ రావు, ఉప సర్పంచ్ సావిత్రమ్మ ఆశప్ప, మాజీ ఎంపీపీ పటేల్ విజయ్ కుమార్, కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దస్తప్ప, సర్పంచ్ మల్లమ్మ, సర్పంచ్ రెడ్యానాయక్, రెడ్డి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.