ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులు నేను చేసి చూపిస్తా... లేకుంటే రాజీనామా చేస్తా: నిర్మాత నట్టి కుమార్ సంచలన ప్రకటన!
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఎన్నికల వేళ టాలీవుడ్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కౌన్సిల్ సభ్యుల సంక్షేమం, శ్రేయస్సును కాపాడటమే లక్ష్యంగా సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన సవాల్ విసిరారు. హైదరాబాద్లోని తన కార్యవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో ఏ ప్యానెల్తోనూ సంబంధం లేకుండా తాను కోశాధికారి (Treasurer) స్థానానికి, తన కుమారుడు నట్టి క్రాంతి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రత్యర్థి ప్యానెల్స్పై నట్టి కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బరిలో ఉన్న 'మన ప్యానెల్', 'ప్రోగ్రెసివ్ ప్యానెల్' రెండూ కూడా నిర్మాతల సంక్షేమం కోసం గతంలో ఏమీ చేయలేకపోయాయని విమర్శించారు. గతంలో మెడిక్లెయిమ్ హెల్త్ పాలసీ పేరుతో ఇచ్చిన హామీలను మన ప్యానెల్ నాయకులు విస్మరించారని, అదే ప్యానెల్ నుంచి మళ్లీ అదే పోస్టుకు పోటీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక ప్రోగ్రెసివ్ ప్యానెల్ అభ్యర్థులు సైతం ఇండస్ట్రీ సమస్యలపై సరిగ్గా స్పందించలేరని, వారు తమ సినిమాల బిజీలో ఉండిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు.
సభ్యుల సంక్షేమం కోసం తాను చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి ఇండస్ట్రీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికైనా వెనుకాడబోనని నట్టి కుమార్ స్పష్టం చేశారు. తనకు మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు ఉన్నాయని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఎన్నికల్లో తనను కోశాధికారిగా గెలిపిస్తే ఆరు నెలల్లోగా పది లక్షల రూపాయల మెడిక్లెయిమ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అమలులోకి తీసుకువస్తానని నట్టి కుమార్ హామీ ఇచ్చారు. అలాగే డెత్ ఫండ్ను పది లక్షలకు, పెన్షన్ను ఐదు వేలకు పెంచేలా కఠిన నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. ఒకవేళ తాను గెలిచిన ఆరు నెలల్లోగా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతే తన పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 25 శాతం ఆక్యుపెన్సీ మరియు ఐదవ షో ఘనత పూర్తిగా తనదేనని ఆయన గుర్తుచేశారు.