థియేటర్ల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు: ఐదేళ్ల కాలపరిమితితో సింగిల్ విండో లైసెన్స్లు - ఏపీఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్!
ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల మనుగడ, సినిమా రంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ సినీ ఎగ్జిబిటర్ల ఫోరమ్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ థియేటర్ల రంగానికి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన భరత్ భూషణ్, రాష్ట్రంలో థియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫైర్, సినిమాటోగ్రఫీ వంటి వేర్వేరు శాఖల లైసెన్సుల గడువులు విభిన్నంగా ఉండటంతో ఎగ్జిబిటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తుచేశారు. దీనికి పరిష్కారంగా అన్ని శాఖలకు సంబంధించిన లైసెన్స్లను ఐదేళ్ల కాలపరిమితితో 'సింగిల్ విండో' విధానంలో రెన్యూవల్ చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
గతంతో పోలిస్తే ఏపీలో థియేటర్ల సంఖ్య క్రమంగా పడిపోతోందని భరత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాష్ట్రంలో 2,000కు పైగా థియేటర్లు ఉండేవని, కానీ ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 1,200కు పడిపోయిందని, ముఖ్యంగా గత కొన్ని నెలల్లోనే వందలాది థియేటర్లు మూతపడ్డాయని పేర్కొన్నారు. థియేటర్ల నిర్వహణను సులభతరం చేసేందుకు టూరిజం మరియు హోటల్ రంగాల మాదిరిగానే సినిమా రంగానికి కూడా 'ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్' వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.
టికెట్ ధరల పెంపు అంశంపై స్పందిస్తూ, ప్రభుత్వం ఈ విషయంపై సానుకూలంగా ఉందని, అయితే మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎగ్జిబిటర్లు కూడా సంయమనం పాటించాలని సూచించారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా యూనిఫామ్ టికెట్ ధరలను సమీక్షించాలని కోరుతున్నామన్నారు. ఎగ్జిబిటర్లందరూ ఎఫ్డీసీలో మెంబర్షిప్ తీసుకుని ఐక్యంగా ఉంటే సమస్యల పరిష్కారం మరింత సులభమవుతుందని భరత్ భూషణ్ పిలుపునిచ్చారు.