స్మృతి మంధానా ప్రపంచ రికార్డు: జయ్ షా ప్రశంసలు
దుబాయ్: మహిళల టీ20 ఆసియా కప్లో భారత ఓపెనర్ స్మృతి మంధానా చారిత్రాత్మక రికార్డులతో విరుచుకుపడింది. హాంకాంగ్-చైనాపై జరిగిన మ్యాచ్లో 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 124 పరుగులు చేసి రికార్డు బ్రేకింగ్ సెంచరీ సాధించింది. ఈ అద్భుత ఇన్నింగ్స్తో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. ఈ ఘనతపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఛైర్మన్ జయ్ షా ఆమెను కొనియాడారు.
మిథాలీ రాజ్ (10,868 పరుగులు) రికార్డును దాటి, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు (10,880*) చేసిన మహిళా క్రికెటర్గా మంధానా రికార్డు సృష్టించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 18వ అంతర్జాతీయ శతకంతో మెగ్ లానింగ్ రికార్డును అధిగమించింది. టీ20 ఆసియా కప్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు (124 పరుగులు) చేసిన బ్యాటర్గా చమరి అథపత్తు (119*) రికార్డును తుడిచిపెట్టేసింది. రెండు టీ20 అంతర్జాతీయ శతకాలు సాధించిన మొదటి భారత మహిళా బ్యాటర్గా చరిత్రకెక్కింది.
మంధాన సాధించిన విజయంపై ఐసిసి ఛైర్మన్ జయ్ షా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ — "మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు సాధించిన స్మృతి మంధానకు హృదయపూర్వక అభినందనలు. మీ ప్రయాణం నిలకడ, కఠోర శ్రమకు నిదర్శనం. మీరు రికార్డులు తిరగరాయడమే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మందికి ఆదర్శంగా నిలిచారు" అని ప్రశంసించారు.
మంధానా విద్వంసకర శతకంతో పాటు షఫాలీ వర్మ (28) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 193/5 స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన హాంకాంగ్-చైనాను భారత బౌలర్లు 56 పరుగులకే ఆలౌట్ చేయడంతో, భారత్ 137 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.